బహుముఖ ప్రజ్ఞకు పట్టం
బల్లెడ చలపతికి ‘కందుకూరి విశిష్ట పురస్కారం’
కళల కాణాచిలో పుట్టి..
బొరివంక గ్రామం కళలకు పుట్టినిల్లు. గ్రామస్తులు ఎన్నో నాటకాలు, నాటికలు ప్రదర్శించి గ్రామ ప్రతిష్టను ఇనుమడింపజేశారు. తాతల,తండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న చలపతికి చిన్నతనం నుంచే కళలపై మక్కువ ఎక్కువ. ముఖ్యంగా 'భక్త ప్రహ్లాద' నాటకంలో హిరణ్యకశిపుడి పాత్రలో ఆయన నటన అద్భుతం. పాత్ర ఔచిత్యాన్ని ఆకళింపు చేసుకుని, తనదైన అభినయంతో ప్రేక్షకులను రంజింపజేసి రంగస్థలంపై తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు.
నాటకరంగ ప్రస్థానం..
1995లో 'జాతి స్మరామి' నాటికతో చలం నాటక జీవితం ప్రారంభమైంది. కళా పోషకులు పండి సీతారామమూర్తి స్థాపించిన 'శార్వాణి గిరిజన సాంస్కృతిక సేవా సంస్థ'కు ఆర్గనైజర్ అయిన పిరియా చలపతి ప్రోత్సాహంతో ఆయన ప్రస్థానం ముందుకు సాగింది. ప్రముఖ దర్శకుడు కె.కె.ఎల్.స్వామి దర్శకత్వంలో 'జాతిస్మరామి', 'తేనెటీగలు పగబడతాయ్', 'మంతువు', 'రాజు వెడలె', 'ఎండని ఎండుచేప', 'రేలా' వంటి ఎన్నో నాటికల్లో చలం నటించారు. అయితే, 'కొత్త పరిమళం' నాటికలోని 'ఉస్మాన్ ఖాన్' పాత్ర చలం కెరీర్లోనే ఒక మైలురాయి. ఈ నాటికను తెలంగాణ, ఆంధ్రాతో పాటు బిలాయ్ వంటి ప్రాంతాల్లో విజయవంతంగా ప్రదర్శించారు. కఠినాత్ముడైన ఉస్మాన్ ఖాన్ పాత్రలో చలం జీవించిన తీరు అద్భుతం. ఈ ఒక్క పాత్రకే ఆయన 60కి పైగా ఉత్తమ విలన్ అవార్డులు అందుకున్నారు. ఒకే సంవత్సరంలో 50 ఉత్తమ విలన్ అవార్డులు అందుకోవడం తెలుగు నాటకరంగ చరిత్రలోనే ఒక రికార్డు అని, ఆ ఘనత తనకే దక్కిందని చలం సగర్వంగా చెబుతారు. ఆ పాత్రకు లభించిన ఆదరణ ఎంతంటే, ఆయన్ను ఇప్పటికీ చాలామంది 'ఉస్మాన్ ఖాన్' అనే పిలుస్తుంటారు. ఈ పాత్ర రూపశిల్పి, దర్శకుడు కె.కె.ఎల్. స్వామికి ఈ ఘనతలో సింహభాగం దక్కుతుందని చలం వినమ్రంగా చెబుతారు. మొత్తం మీద దాదాపు 30 నాటకాల్లో ఆయన విభిన్న పాత్రలు పోషించారు.
వెండితెరపై కూడా..
నాటకరంగంలోనే కాకుండా 'రెండు అక్షరాలు', 'నారప్ప', 'దేవకొండ పోలీస్స్టేషన్' వంటి చిత్రాల్లో కూడా చలపతి నటించి తన ప్రతిభను చాటుకున్నారు.
కందుకూరి పురస్కారం
తాజాగా, కందుకూరి వీరేశలింగం 177వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బల్లెడ చలపతిని 'కందుకూరి విశిష్ట పురస్కారం'తో సత్కరించింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇది కేవలం తన వ్యక్తిగత విజయం మాత్రమే కాదని, తన స్వగ్రామమైన బొరివంకకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చలం పేర్కొన్నారు.
కుటుంబం, గురువుల ప్రోత్సాహం
తన ఈ ప్రయాణంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వెలకట్టలేనిదని చలం అంటారు. నాటకాల ప్రదర్శనల కోసం నాలుగైదు రోజులు ఇంటికి రాకపోయినా భార్య, పిల్లలు ఎంతో సహకరిస్తారని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనలోని కళను వెలికితీసి ప్రోత్సహించిన పిరియా చలపతిరావు, దర్శకుడు కె.కె.ఎల్. స్వామిలకు జీవితాంతం రుణపడి ఉంటానని, తనను గ్రామ ప్రజలు, యువత ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తున్నారని చెబుతున్నారు.
బల్లెడ చలపతి ప్రస్థానం అంకితభావానికి, కళాతృష్ణకు నిలువెత్తు నిదర్శనం. 'ఉస్మాన్ ఖాన్'గా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆయన కందుకూరి విశిష్ట పురస్కారంతో తెలుగు నాటకరంగానికి, మన గ్రామానికి మరింత వన్నె తెచ్చారు.
- పూర్ణచందర్, ఉద్దానం తొలిపొద్దు(16.04.2025)- 9705094441

